నల్లగొండ ప్రతినిధి, మే13(నమస్తే తెలంగాణ):ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండోరోజూ లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగాయి. తొలిరోజు మాదిరిగానే నిత్యావసర వస్తువులతో పాటు ఇతర అన్ని రకాల సామగ్రిల దుకాణాలు, బట్టల దుకాణాలు ఇలా అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. టీ స్టాల్స్, హోటళ్లు సైతం ఉదయం పూట బ్రేక్ఫాస్టును ప్రజలకు అందుబాటులోకి తెస్తూ పది గంటల వరకు పనిచేశాయి. జిల్లా అంతటా ఈ సమయంలోనే ప్రజలు తమకు అవసరమైన వస్తువులను, సామగ్రిని కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో ఆ నాలుగు గంటల పాటు రద్దీ కనిపించింది. తర్వాత యథావిధిగా లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఉదయం 10గంటల తరవాత అన్ని కార్యకాలాపాలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం అనుమతించిన సేవలకు సంబంధించిన విభాగాలు మినహా మిగతా అన్ని కూడా మూతపడ్డాయి.
ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులు, సిబ్బందితో పనిచేశాయి. ఇక బ్యాంకులు కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే సేవలను అందించాయి. ఏటీఎంలు మాత్రం ప్రజలకు 24 గంటల సర్వీసులను అందిస్తున్నాయి. లాక్డౌన్ అమలు కోసం పోలీసులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు ఉదయం ఆరు గంటల వరకు ముఖ్య కూడళ్లల్లో నిరంతర విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణాల్లో తిరిగి వాహనదారులను ఆపి చెక్ చేస్తున్నారు. అనుమతి లేకుండా అనవసరంగా బయటకు వచ్చారని తేలితే జరిమానా విధిస్తున్నారు. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి రావద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతుండడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. దీంతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు సాహసించడం లేదు. జిల్లా కేంద్రమైన నల్లగొండతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, చిట్యాల, చండూర్ లాంటి ప్రధాన పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక మండల కేంద్రాల్లో భారీ కేడ్ల ద్వారా రాకపోకలను అడ్డుకుంటూ నిలువరిస్తున్నారు. అనవసరంగా ప్రయాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పలుకూడళ్లల్లో లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన వారు మినహా మిగతా వారు ఇండ్లకే పరిమితం అయ్యారు. అన్నిచోట్ల లాక్డౌన్ను సంపూర్ణంగా కొనసాగుతుంది.
సడలింపు సమయంలో ఆర్టీసీ సేవలు
ఇక నల్లగొండ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సులు లాక్డౌన్ సడలింపు సమయంలోనే నడిచాయి. ఎక్కువ బస్సులు డిపోలకే పరిమితం కాగా ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు సమీప ప్రాంతాల వరకు మాత్రమే బస్సులు నడిచాయి. లాక్డౌన్ నేపథ్యంలో ప్రయాణికులు కూడా పెద్దగా కనిపించలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ప్రైవేటు వాహనాలను లేదంటే సొంత వాహనాలను ఆశ్రయించారు. పది గంటల వరకే బయటకు వచ్చిన బస్సులన్నీ తిరిగి డిపోలకు చేరుకున్నాయి. ఇక మరోవైపు విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపైనా లాక్డౌన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. కేవలం సరుకు రవాణా వాహనాలే దర్శనం ఇచ్చారు. అత్యవసర అంబులెన్స్లు, వైద్య అవసరాల కోసం వెళ్తున్న వారి వాహనాలు.. అవి కూడా పోలీసు శాఖ జారీ చేసిన ఈ పాస్ల అనుమతితోనే తిరిగాయి. రాష్ట్ర రహదారులైన నార్కట్పల్లి-అద్దంకి, నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారుల్లోనూ సడలింపు సమయంలో మినహా మిగతా సమయంలో పూర్తిగా బోసిపోయాయి. కొవిడ్ సేవలకు, ధాన్యం కొనుగోళ్లుకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించారు. కొవిడ్ పరీక్షలతో పాటు జిల్లాఅంతటా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా నిర్దేశిత కేంద్రాలన్నింటిలోనూ కొనసాగింది. ధాన్యం కొనుగోళ్లకు ఆటంకాలు లేకుండా చూశారు. వాటి కోసం వెళ్తున్న రైతులను గానీ, వాహనాలకు గానీ ఎక్కడా ఆటంకం కలిగించలేదు.
స్వయంగా రంగంలోకి ఎస్పీలు
తొలిరోజు మాదిరిగానే రెండోరోజూ కూడా ఆయా జిల్లాల పరిధిలో ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించారు. సూర్యాపేటలో ఎస్పీ భాస్కరన్ స్వయంగా బందోబస్తును విధులను పరిశీలించారు. అదేసమయంలో అటుగా వస్తున్న వాహనదారులను ఆపి ఆరా తీశారు. ఎందుకు రోడ్లపైకి వచ్చారని ప్రశ్ని స్తూ అనవసరంగా వచ్చిన వారికి జరిమానాలు విధించారు.