న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా పలు నూతన వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కప్పా, లాంబ్డా వేరియంట్లను దృష్టిసారించాల్సిన స్ట్రెయిన్లుగా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూపీలో కొత్త వేరియంట్ కప్పా కేసులు రెండు వెలుగుచూశాయి. మార్చి నుంచే డెల్టా తరహాలోనే కప్పా వేరియంట్ ఆనవాళ్లు భారత్లో కనిపించాయని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. దీని శాస్త్రీయ ప్రభావం, కప్పా వేరియంట్పై వ్యాక్సిన్ సామర్ధ్యంపై మనం దృష్టిసారించాల్సి ఉందని ఆయన చెప్పారు. కప్పా వేరియంట్ను వైద్య నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఇక లాంబ్డా వేరియంట్ దృష్టిసారించాల్సిన వేరియంట్గా గుర్తించిన ఏడవ స్ట్రెయిన్ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో లాంబ్డా వేరియంట్ గుర్తించగా పెరూలోనే 80 శాతం కేసులు వెలుగుచూశాయని చెప్పారు. భారత్లో ఈ వేరియంట్ ఇప్పటివరకూ నమోదు కాలేదని తెలిపారు. ఇక భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజుకు 2.35 లక్షల వ్యాక్సిన్ డోసులతో ఈ కార్యక్రమం మొదలవగా ప్రస్తుతం రోజుకు 40 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించే స్ధాయికి ఎగబాకిందని వెల్లడించింది.