నాగ్పూర్: ‘కరోనా నుంచి కోలుకోవడానికి మీరు 1,44,000 లీటర్ల ఆక్సిజన్ను పీల్చుకున్నారు. ఈ ప్రాణవాయువంతా ప్రకృతి నుంచే వచ్చింది. కాబట్టి, డిశ్చార్జీ కాగానే కనీసం పది మొక్కలనైనా నాటండి. ప్రకృతి మీకు ఏదైతే ఇచ్చిందో.. దాన్ని తిరిగిచ్చేసేయండి’ – కరోనా నుంచి కోలుకొని వెళ్తున్న వారికి మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన గెట్వెల్ దవాఖాన వైద్యులు చెబుతున్న మాటలివి. ఉచితంగా వచ్చే ఎలాంటి అమూల్యమైన వస్తువునైనా మనుషులు లెక్కచేయరు. కరోనా సంక్షోభం వల్ల ఆక్సిజన్ విలువేంటో ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చింది. ఉచితంగా ప్రాణవాయువును అందించే చెట్ల ప్రాధాన్యత కూడా అర్థమయ్యింది. అందుకే, నాగ్పూర్ దవాఖానలోని వైద్యులు చెబుతున్న మాటలను డిశ్చార్జీ అయిన రోగులు, వారి కుటుంబసభ్యులు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. దవాఖాన నుంచి డిశ్చార్జీ అవుతున్న ప్రతి రోగి చేత కనీసం పది మొక్కలనైనా నాటించేలా దవాఖాన హెడ్ డాక్టర్ రాజేశ్ స్వర్ణాకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సోషల్మీడియాలో ఓ డాక్టర్ పోస్టును చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన తెలిపారు.
వెంటిలేటర్పై ఉన్న రోగి రోజుకు పీల్చే ఆక్సిజన్ 1.30 లక్షల లీటర్లు
ఒక యువకుడు సగటున రోజుకు పీల్చే ఆక్సిజన్ 11 వేల లీటర్లు
సంవత్సరంలో ఒక చెట్టు విడుదల చేసే ఆక్సిజన్ 117 లీటర్లు
రెండు చెట్లు నరికినందుకు కోటి జరిమానా
మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో రెండు టేకు చెట్లను నరికివేశాడన్న ఆరోపణలతో చోటేలాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అటవీశాఖ అతనికి రూ.1.20 కోట్ల జరిమానా విధించింది. ఒక చెట్టు తన జీవితకాలంలో ఆక్సిజన్ విడుదల, కలప, పండ్లు ఇవ్వడం, కాలుష్య నివారణ తదితర అంశాలను బట్ట రూ.60 లక్షల మేర లాభాలను అందిస్తుందని, అందుకే రెండు చెట్లను నరికేసిన నిందితునికి రూ.1.20 కోట్ల జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు.