కనగల్, మే 11: కరోనా కట్టడికి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీధుల్లో నిత్యం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఉదయం, మధ్యాహ్నం షిప్టుల వారీగా పని చేస్తూ చెత్తను తొలగించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పనులను పర్యవేక్షిస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నారు. తమ గ్రామంలో కరోనా బారిన పడి హోం క్వారంటైన్లో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది సాయంతో చెబుతూ ధైర్యం నింపుతున్నారు.
గ్రామాల్లో శానిటేషన్
నల్లగొండ రూరల్ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మండలంలోని అప్పాజీపేట, వెలుగుపల్లి, రాములబండ, రంగారెడ్డి నగర్ గ్రామాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
నాంపల్లి : అతి వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ తమ దరికి చేరకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సర్పంచులు కోరారు. మండలంలోని రాందాస్తండా, రేవెల్లి గ్రామాల్లో సర్పంచులు నీలా, తుమ్మలపల్లి హర్షితారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయించారు. కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.