న్యూఢిల్లీ: జమ్ము ఎయిర్బేస్పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డి-4 డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీని ద్వారా డ్రోన్ దాడుల ముప్పు నుంచి దేశ రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చు. నాలుగు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను ఈ వ్యవస్థ గుర్తించి దాడి చేస్తుంది. అత్యంత కీలక ప్రాంతాలపై దాడి చేసే డ్రోన్లను ఇది ప్రధానంగా గుర్తించి ధ్వంసం చేస్తుంది. డి-4 డ్రోన్ వ్యవస్థలో అనేక సెన్సార్లు, డ్రోన్లపై ఎదురు దాడి చేసే రెండు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ (ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లేలముడి మంజుల తెలిపారు. ఈ టెక్నాలజీ డ్రోన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను జామ్ చేస్తుందని, డ్రోన్ల హార్డ్వేర్ను నాశనం చేస్తుందని ఆమె చెప్పారు.
ఢిల్లీలోని రాజ్పథ్లో ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా భద్రతాపరమైన రక్షణకు ఈ వ్యవస్థను వినియోగించినట్లు మంజుల వెల్లడించారు. డి-4 డ్రోన్ వ్యవస్థతో ప్రమాదకర డ్రోన్ల ఉనికిని త్వరగా గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా వాటి దాడుల నుంచి ప్రముఖ ప్రాంతాలను రక్షించుకోవచ్చని వివరించారు.