ముంబై: మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. అయితే కొత్త కేసులు, మరణాల నమోదు ఆదివారం కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకుపైగా కరోనా కేసులు, 800కుపైగా మరణాలు రికార్డవుతున్నాయి. అయితే శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 48,401 కరోనా కేసులు, 572 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,01,737కు, మొత్తం మరణాల సంఖ్య 75,849కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 60,226 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 44,07,818కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,15,783 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది.