ముంబై : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లతో కూడిన పాలక మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ తనపై నిఘా పెంచిందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె సంచలన వ్యాఖ్యలు చేశారు. పటో్లె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్వహించిన కార్యక్రమాల నివేదికను తెప్పించుకుని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు.
తాను ఇటీవల ఉదయం మూడు గంటలకు ఓ కార్యక్రమానికి హాజరు కాగా, మీడియాలోనూ ఎలాంటి వార్తలూ రాకపోయినా సీఎంకు ఆ వివరాలు తెలిసాయని చెప్పారు. క్షేత్ర స్ధాయి పరిస్ధితులు తమ చేయిదాటి పోయాయని శివసేన, ఎన్సీపీ గుర్తెరిగాయని అన్నారు.
తాము ప్రభుత్వంలో ఉన్నా కీలక హోం శాఖ, సీఎం పోస్టులు శివసేన, ఎన్సీపీ చేతిలో ఉండటంతో తమపై నిఘా పెడుతున్నారని కాంగ్రెస్ నేత వాపోయారు. కాగా గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ హయాంలో తన ఫోన్ను ట్యాప్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఇటీవల కాంగ్రెస్ నేత నానా టోలె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.