ముంబై: మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా, ముంచెత్తిన వరదల నుంచి ప్రభుత్వ డబ్బును కాపాడేందుకు ఒక ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రాణాలకు తెగించాడు. కలెక్షన్గా వచ్చిన లక్షలాది డబ్బులతో ఒక బస్సు పైకి ఎక్కి పలు గంటలపాటు నిరీక్షించాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో ఆదివారం ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు పలు నదులు పొంగిపొర్లాయి. దీంతో రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లితోపాటు అనేక జిల్లాల్లోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి.
ఈ నేపథ్యంలో రత్నగిరి జిల్లాలోని చిప్లున్ బస్ డిపో కూడా వరదల్లో చిక్కుకున్నది. కాగా, డిపో మేనేజర్ రంజిత్ రాజే షిర్డే వద్ద రూ.9 లక్షల ఆర్టీసీ రోజువారీ కలెక్షన్ డబ్బులు ఉన్నాయి. మరోవైపు వరద నీరు మరింతగా పెరుగడంతో సమీప ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చిప్లున్ డిపో కార్యాలయంలోకి వరద నీరు చేరడంతో ఏమి చేయాలో ఆయనకు తోచలేదు. దీంతో ప్రభుత్వ డబ్బును కాపాడాలన్న ఉద్దేశంతో రంజిత్ తన క్షేమం కోసం ఆలోచించలేదు. సురక్షితంగా అనిపించిన ఒక బస్సుపైకి ఆ డబ్బుతో సహా ఎక్కాడు. ఏడు గంటలకుపైగా అక్కడ డబ్బుతోపాటు నిరీక్షించాడు. వరద ప్రభావం తగ్గిన తర్వాత ఆ డబ్బును సురక్షితంగా జమ చేశాడు.
‘ప్రతి నిమిషం నీటి మట్టం పెరుగుతోంది. నగదును ఆఫీసులో ఉంచితే, అది తడవడంతోపాటు నీటిలో కొట్టుకుపోయే అవకాశాలున్నాయి. ఆ డబ్బుకు నేనే బాధ్యత వహించాలి. అందుకే నా గురించి ఆలోచించకుండా డబ్బును రక్షించుకోవడం నా ప్రధాన కర్తవ్యమని భావించాను’ అని రంజిత్ తెలిపారు. వరదల నుంచి డబ్బును కాపాడిన విషయాన్ని ఆర్టీసీ రత్నగరి డివిజన్ కార్యాలయానికి ఆయన తెలియజేశారు. డిపోలోని మరి కొందరు ఉద్యోగులు కూడా ముంపు నుంచి తమను కాపాడుకునేందుకు అక్కడున్న కొన్ని బస్సులపైకి చేరినట్లు వెల్లడించారు.