పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనులో ఉన్న పులితో తమ పార్టీ స్నేహం చేయదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతుందని అన్నారు.
తాను ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఓ వ్యక్తి పులి బొమ్మను బహుమతిగా ఇస్తే తాము పులులతో ఎప్పటికీ స్నేహంగా ఉంటామని వ్యాఖ్యానించగా శివసేన ఎన్నికల గుర్తు పులి కావడంతో ఆ పార్టీతో బీజేపీ అనుబంధంపై మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయని చెప్పారు. దీనిపై పాటిల్ వివరణ ఇస్తూ అడవిలో ఉండే పులితో తాము సన్నిహితంగా ఉంటామని బోనులో బంధించిన పులితో కాదని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో తిరిగి పూర్వ వైభవాన్ని పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ అనంతరం బీజేపీకి శివసేన దగ్గరవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాటిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.