బోధన్, ఏప్రిల్ 26 : సమైక్య పాలకుల వలస పాలన నుంచి తన జాతి విముక్తి కోసం సరిగ్గా రెండు దశాబ్దాల కిందట కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్రహ్మరథం పట్టింది. దశాబ్దాల తరబడి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో రగులుతున్న జిల్లా ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు నాడు కేసీఆర్ అందించిన గులాబీ జెండాను అందుకున్నారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. మంగళవారంనాటికి ఆ పార్టీ రెండు దశాబ్దాలను పూర్తిచేసుకుని 21 ఏట అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాలుగా కొనసాగిన టీఆర్ఎస్ ప్రస్థానం జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
గులాబీ జెండాకు తొలి ఏడాదిలోనే బ్రహ్మరథం పట్టిన జిల్లా
2001 ఏప్రిల్ 27న సీఎం కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీ ఆవిర్భవించిన వెంటనే బ్రహ్మరథం పట్టింది. జిల్లాలోని అనేక మండలాల్లో ఊళ్లకు ఊళ్లే స్వచ్ఛందంగా గులాబీ జెండాను ఎత్తుకున్నాయి. రాష్ట్రంలో గులాబీ పార్టీని అత్యంత ఎక్కువగా ఆదరించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పలుసార్లు కేసీఆర్ ప్రశంసలను అందుకున్నది. పార్టీ ఆవిర్భవించిన మూడు నెలలకే జిల్లాలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ జైత్రయాత్రను కొనసాగించింది. టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ ఆర్మూర్, బాల్కొండ తదితర నియోజకవర్గాల్లో ప్రజలు నిర్ణయించుకున్నారు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్న 450 మంది సర్పంచులుగా ఎన్నికయ్యారు.
270 ఎంపీటీసీలను, 19 జడ్పీటీసీలను టీఆర్ఎస్ గెలుచుకుంది. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనేక స్థానాల్లో ఆయా గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గమనార్హం. జడ్పీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లా పరిషత్పై పార్టీ ఆవిర్భవించిన నాలుగు నెలలకే గులాబీ జెండా ఎగిరింది. కరీంనగర్ జడ్పీతో పాటు నిజామాబాద్ జడ్పీపై గులాబీ జెండా ఎగరడం టీఆర్ఎస్కు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఊపును అందించింది. టీఆర్ఎస్ తొలి జడ్పీ చైర్మన్గా అంతకుముందే టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన అనంతరం టీఆర్ఎస్కు చెందిన గాదారి అనిత కూడా జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇలా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందే జిల్లాలో ఉద్యమ పార్టీ రెండుసార్లు జడ్పీపై విజయకేతనం ఎగురవేసింది. ఇక, తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లోనూ, 2018లోనూ ఉమ్మడి జిల్లాలో జడ్పీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్నే ఆదరించారు.
ఆర్మూర్ ప్లీనరీతో గులాబీ సైన్యంలో జోష్..
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నప్పుడు జిల్లాలోని ఆర్మూర్లో జరిగిన టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ వార్షికోత్సవం, ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ 2013 ఏప్రిల్ 27న పెద్ద ఎత్తున జరిగింది. జిల్లా చరిత్రలో ఒక పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ జరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఈ ప్లీనరీలో తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 35 వేల మంది ప్రతినిధులు, పార్టీ అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఈ ప్లీనరీ కోసం రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో సభను ఏర్పాటుచేశారు. తెలంగాణ పోరాటం తుది దశకు చేరుకున్న సందర్భంలో జరిగిన సభ జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో జోష్ను నింపింది. అప్పటివరకు 2004, 2009 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సాధన కోసం ఏదో ఒక పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. అయితే, ఆర్మూర్ ప్లీనరీలో ఒంటరిగానే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని, కొత్త రాష్ట్రంలో తమదే అధికారమని కేసీఆర్ చేసిన విస్పష్ట ప్రకటన.. పార్టీ విధానాల్లో నిర్ణయాత్మకమైన మార్పని పార్టీ నాయకులు అంటున్నారు.
ఐదు లక్షల మంది బలగంతో..
ప్రతి ఏటా సంస్థాగతంగా పటిష్టమవుతున్న టీఆర్ఎస్ ఈ ఏడాది మరింతగా బలపడింది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఐదు లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సభ్యత్వ నమోదు కాంగ్రెస్ తదితర పార్టీల మాదిరిగా మొక్కుబడి తంతుగా జరగలేదు. పార్టీ ఆశయాలు నచ్చి, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి తమ సొంత డబ్బుతో రుసుమును చెల్లించినవారే టీఆర్ఎస్ సభ్యులుగా చేరారు. వీరందరికీ పార్టీ నాయకత్వం జీవితబీమాను కల్పించింది.
2010 ఉప ఎన్నికల్లో..
తెలంగాణ కోసం కేసీఆర్, అప్పటి జేఏసీ పిలుపుమేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉప ఎన్నికల్లో వారు తెలంగాణ నినాదంతో పోటీచేశారు. ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్రెడ్డికి ప్రచారం చేయడంతో పాటు బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన యెండల లక్ష్మీనారాయణకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేసి వారిని గెలిపించారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ గెలుపు కోసం కూడా కేసీఆర్ కృషిచేయడం తెలంగాణ ఉద్యమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం..
అన్ని ఎన్నికల్లోనూ విజయపరంపర..
తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన రెండు అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్… 2019లో కూ డా 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుం చి ఎన్నికైన జాజుల సురేందర్ సై తం టీఆర్ఎస్ నాయకత్వానికి ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరారు.
కేసీఆర్ మార్గదర్శనంలో కదం తొక్కిన జిల్లా
కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ ఉద్యమం ఈ జిల్లాలో తొలినాళ్లలోనే కదం తొక్కింది. అక్కడి నుంచి మొదలు తెలంగాణ సాధన వరకు 2014లో స్వరాష్ట్ర కల నెరవేరేవరకు గులాబీ జెండా నాయకత్వంలో ఉద్యమం పరవళ్లు తొక్కింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చొరవతో ఏర్పాటైన జేఏసీలోనూ గులాబీ శ్రేణులు అన్నీ తామై ఉద్యమాన్ని నడిపారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం కూడా జిల్లాలో సమైక్యాంధ్ర నాయకుల కుట్రలను ఓడించే దిశగా జాగరుకతను ప్రదర్శిస్తున్నాయి. నాడు తెలంగాణ సాధన కోసం పోరాడిన గులాబీ సైన్యం ఇప్పడు బంగారు తెలంగాణ దిశగా పరుగులు తీస్తున్నది. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ప్రస్తుతం అధినాయకుడిగా రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భాగస్వాములవుతున్నారు.