ముంబై: రానురాను రాజు గుర్రం గాడిద అయ్యిందన్నట్లు రోజులు మారుతున్నా కొద్ది సమాజాంలో మనుషుల మనస్తత్వాలు మారిపోతున్నాయి. క్షణికావేశంతో తీవ్ర నిర్ణయాలు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతున్నది. మరీ ఎంత ఘోరమంటే చిన్న విషయాలకే చంపుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. తల్లితో గొడవ పడిన ఓ యువకుడు క్షణికావేశంలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. మంగళవారం రాత్రి పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. వసాయ్ ఏరియాకు చెందిన ఓ 18 ఏండ్ల యువకుడికి, 48 ఏండ్ల అతని తల్లికి మధ్య కుటుంబ విషయాల్లో ఇటీవల తరచూ గొడవ జరుగుతున్నది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ మరింత తీవ్రమైంది. దాంతో క్షణికావేశానికి లోనైన యువకుడు తల్లి గొంతుపిసికి చంపేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.