ముంబై: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు ( Heavy rains ) కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడా రీజియన్లో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక దాదాపు 200పైడా పశువులు కొట్టుకుపోయాయి. పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. మరాఠ్వాడా రీజియన్లోని ఎనిమిది జిల్లాలు, 180 సర్కిళ్లలో రికార్డు స్థాయిలో 65 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మరణించిన 10 మందిలో మరాఠ్వాడా రీజియన్లోని ఆరు జిల్లాలకు చెందినవారు ఉన్నారు. బీడ్ జిల్లాకు చెందిన ముగ్గురు, ఉస్మానాబాద్, పర్భణి జిల్లాలకు చెందినవారు ఇద్దరు చొప్పున ఉన్నారు. ఇక జల్నా, నాందేడ్, లాటూర్ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగితా రెండు జిల్లాలైన ఔరంగాబాద్, హింగోలిలో ఇప్పటివరకు మరణాలు నమోదు కాలేదు.