న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ముందస్తు అనుమతి లేకుండా అమెరికా యుద్ధనౌక భారత జల్లాలోకి ప్రవేశించటం రెండుదేశాల మధ్య వివాదాస్పదం అవుతున్నది. అమెరికా నేవీలోని 7వ ఫ్లీట్కు చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక యూఎస్ఎస్ జాన్పాల్ జోన్స్ ఈ నెల 7న లక్షద్వీప్కు 130 నాటికల్ మైళ్ల (224 కిలోమీటర్ల) వరకు చొచ్చుకొచ్చింది. ఈ ప్రాంతం భారత ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) పరిధిలో ఉన్నది. ఈఈజెడ్ పరిధిలో ప్రయాణించాలంటే ముందుగా సదరు దేశం అనుమతి తీసుకోవాలి. అమెరికా అనుమతి తీసుకోలేదు. స్వేచ్ఛాయుత నౌకాయాన ఆపరేషన్లో (ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్-ఎఫ్వోఎన్వోపీ) భాగంగానే భారత జలాల్లోకి ప్రవేశించినట్టు అమెరికా తెలిపింది. భారత్కు ‘మితిమీరి’ ఉన్న సముద్ర హక్కులను సవాల్ చేస్తూ, స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కులను బలపరుస్తూ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి, భారత్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఆ దేశ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి ప్రవేశించినట్టు అమెరికా ప్రకటించింది. దీనిపై భారత్ మండిపడింది. రెండు మిత్రదేశాల మధ్య ఈ ఘటన అభ్యంతరకరమైనదని భారత నేవీ మాజీ అధిపతి అడ్మిరల్ అరుణ్ప్రకాశ్ అన్నారు. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక (యూఎన్సీఎల్ఓఎస్) ప్రకారం ఈఈజెడ్ పరిధిలో ఏ ఇతర దేశాలూ సంబంధిత దేశం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎలాంటి వివాదాస్పద యాత్రలు కానీ, సైనిక విన్యాసాలు కానీ నిర్వహించకూడదన్న విషయాన్ని గుర్తుచేసింది. భారత ఈఈజెడ్ గుండా అమెరికా యుద్ధ నౌక ప్రయాణించడంపై దౌత్యమార్గాల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఈఈజెడ్ పరిధిలో అమెరికా నౌకలు స్వేచ్ఛాయుత నౌకాయాన ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ ఇలాంటి ఆపరేషన్ చేపట్టినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.