చెన్నై: పుదుచ్చేరి అసెంబ్లీకి నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ఒక పార్టీకి చెందిన వ్యక్తులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆ ముగ్గురిని నిబంధనల ప్రకారమే నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమించారని స్పష్టంచేసింది. సెమీస్టేట్ పుదుచ్చేరికి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 30 స్థానాలకుగాను 10 స్థానాల్లో ఎన్ రంగస్వామి కాంగ్రెస్, ఆరు స్థానాల్లో బీజేపీ విజయం సాధించాయి. ఆ రెండు పార్టీలు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అయితే, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి అసెంబ్లీకి ముగ్గురు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇటీవల కే. వెంకటేశన్, వీపీ రామలింగం, ఆర్పీ అశోక్బాబులను నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమించింది. ఆ నియామకానికి సంబంధించి కేంద్రప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ పుదుచ్చేరి కరిక్కాలంపాక్కం పంచాయతీ మాజీ అధ్యక్షుడు జగన్నాథన్ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
రాజ్యాంగం ప్రకారం.. ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలను నామినేటెడ్ సభ్యులుగా నియమించాలని, కానీ, ఒక పార్టీకి చెందిన వారిని నియమించడం చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ తెలిపారు. ఈ పిటిషన్ విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత, అదనపు సొలిసిటర్ జనరల్ శంకరనారాయణ హాజరై, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వారిని నామినేటెడ్ సభ్యులుగా నియమించరాదని మాత్ర మే చట్టంలో ఉందని, ప్రస్తుతం నియమించిన ముగ్గురు సభ్యుల నియామకం సబబేనని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ముగ్గురు నామినేటెడ్ సభ్యుల నియామకం సబబేనని తేల్చిచెప్పింది.