చెన్నై: ఇంగ్లండ్ నుంచి లగ్జరీ కారును ఇంపోర్టు చేసుకుని దిగుమతి పన్ను ఎగవేసిన కేసులో తమిళ నటుడు విజయ్కి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఈ నెల 13న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కోర్టు స్టే విధించింది. నటుడు విజయ్ 2012లో ఇంగ్లండ్ నుంచి ఒక లగ్జరీ కారును (రోల్స్ రాయిస్ ఘోస్ట్) దిగుమతి చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో విజయ్ దిగుమతి సుంకం నుంచి 80 శాతం రాయితీ కోరుతూ కేవలం 20 శాతం మాత్రమే చెల్లించాడు.
అయితే, కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్ నటుడు విజయ్కి దిగుమతి పన్ను రాయితీ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయినా విజయ్ ట్యాక్స్ చెల్లించకపోవడంతో అతనిపై మద్రాస్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో ఈ నెల 13న హైకోర్టు సింగిల్ జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం తీర్పు వెలువరించారు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసినందుకు విజయ్కి రూ. లక్ష జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన రీల్ హీరోలు నిజ జీవితంలో రియల్ హీరోల్లా ఉండాలని వ్యాఖ్యానించారు. నటుడు విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టివేశారు.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దాంతో జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ ఆర్ హేమలతతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విజయ్ పిటిషన్పై విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత నటుడు విజయ్కి వ్యతిరేకంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అదే సమయంలో కారు దిగుమతికి సంబందించి బకాయిపడిన 80 శాతం పన్నును కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్కు చెల్లించాలని విజయ్కి సూచించింది.