భోపాల్ : మధ్యప్రదేశ్లోని గంధ్వాని నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ బంగ్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. 38 ఏండ్ల మహిళ తన భర్తతో కలిసి ఎమ్మెల్యే బంగ్లాలో గత సంవత్సర కాలం నుంచి సర్వెంట్లుగా పని చేస్తున్నారు. అయితే ఆ మహిళ ఆదివారం బంగ్లాలోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను గమనించిన భర్త తక్షణమే ఎమ్మెల్యే సింఘార్కు సమాచారం అందించాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంతో పాటు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సింఘార్ జీవితంలో తనకు చోటు ఇవ్వలేదని, అందుకు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నది. అయితే గత కొంతకాలం నుంచి ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని, అంబాల, భోపాల్లో సైకియాట్రిక్ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మహిళ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఎమ్మెల్యే సింఘార్ అక్కడ లేరు. గత మూడు రోజులు గంధ్వాని నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింఘార్ మాట్లాడుతూ.. ఆ మహిళ చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు. తనకు మంచి స్నేహితురాలు అని ఆయన పేర్కొన్నారు. ఆమె సైకియాట్రిక్ వద్ద చికిత్స పొందుతున్నట్లు తనకు అసలు తెలియదు అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.