శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) ఫయాజ్ అహ్మద్ ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు ఆయనను హత్య చేశారు. కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన మాజీ ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్ పుల్వామా జిల్లాలోని అవంతీపొర సమీపంలోని హరిపరిగ్రామ్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో అహ్మద్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్య రజా బేగమ్, కుమార్తె రఫియా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రజా బేగం మృతిచెందారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అహ్మద్ కుమార్తె దవాఖానలో చికిత్స పొందుతున్నదని వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.