భోపాల్ : కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు, ఆ వైరస్ నుంచి కోలుకునేందుకు జీసస్ను ప్రార్థించండి.. అంటూ ప్రచారం చేసిన ఓ హెల్త్ వర్కర్ పోలీసు విచారణను ఎదుర్కొంటున్నది. మధ్యప్రదేశ్ రాట్లాం జిల్లాలోని ఓ గ్రామంలో హెల్త్ వర్కర్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ.. జీసస్ను ప్రార్థించి, కరోనా నుంచి రక్షణ పొందండి.. ఒక వేళ వైరస్ బారిన పడితే కోలుకునేందుకు జీసస్ను ప్రార్థించండి.. అంటూ ప్రచారం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక వ్యక్తి ఒకరు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. జీసస్ను ప్రార్థించాలని ప్రజలను ఎందుకు అడుగుతున్నారు? మిమ్మల్ని ఎవరు పంపారు? ఏ ఆస్పత్రి నుంచి మీరు వచ్చారు? జీసస్ను ప్రార్థిస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు అని ఎందుకు ప్రజలకు చెప్తున్నారు? అని అడిగారు.
ఇందుకు ఆ హెల్త్ వర్కర్ సమాధానం ఇస్తూ.. జీసస్ క్రీస్తును ప్రార్థిస్తే కరోనా నుంచి త్వరగా కోలుకుకుంటారని ఆమె చెప్పారు.
ఈ ఘటనపై రాట్లాం జిల్లా తహసీల్దార్ బీఎస్ ఠాకూర్ స్పందించారు. ప్రభుత్వం రిక్రూట్ చేసిన కాంట్రాక్ట్ హెల్త్ వర్కర్.. జీసస్ను ప్రార్థించాలని ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఆమె వద్ద క్రైస్తవ మతానికి చెందిన కరపత్రాలు కూడా లభ్యమైనట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని స్పష్టం చేశారు.
హెల్త్ వర్కర్ ప్రచారం నిర్వహించిన వీడియోను బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ ట్వీట్ చేశారు. ఏ మతం కూడా కరోనాను తరిమేయదు. డాక్టర్లు, మెడికల్ సిబ్బంది మాత్రమే కరోనా నుంచి ప్రజలను కాపాడగలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ హెల్త్ వర్కర్ మతాన్ని ప్రజలకు అంటగట్టడం సరికాదన్నారు. ఇది ఖండించదగ్గ విషయమని శర్మ ట్వీట్లో పేర్కొన్నారు.