హుజూరాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీ వీరరాఘవరెడ్డి
హుజూరాబాద్టౌన్, జూన్ 6: దళితుల భూములను ఆక్రమించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను వెంటనే అరెస్టు చేయాలని హుజూరాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్కల వీరరాఘవరెడ్డి కోరారు. హుజూరాబాద్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసైన్డ్ భూములను కబ్జా చేసిన విషయాన్ని ఈటల ఒప్పుకున్నాడని, దానికి ఎలాంటి విచారణ కూడా అవసరం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఈటలకు ప్రభుత్వంలో, పార్టీలో అగ్రస్థానాన్ని కల్పించినా ఇముడ్చుకోలేదన్నారు. భూములను కబ్జా చేసిన ఈటల ఆత్మగౌరవం అనడం దళితులను, తెలంగాణ ప్రజలను కించపరచడమేనని అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తల్లిలాంటి పార్టీకి, సీఎం కేసీఆర్పై అవాక్కులు, చెవాకులు పేల్చడం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉందన్నారు. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతలు అమ్ముడు పోయారంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆక్రమించిన భూములను తిరిగి దళితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు బాణాల శ్యాంసుందర్, ఆర్ మధు, ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.