పాట్నా : కుమారుడి మరణం తట్టుకోలేక ఓ తల్లి మృతి చెందింది. ఈ క్రమంలో తల్లీకుమారుడి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్లోని పూర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కిషన్గంజ్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆశ్విని కుమార్ తన బృందంతో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర్ దినాజ్పూర్కు శనివారం వెళ్లారు. ఓ బైక్ దొంగతనం కేసులో ఓ వ్యక్తిని విచారిస్తుండగా, ఆశ్విని కుమార్ను దుండగులు చుట్టుముట్టి దాడి చేశారు. ఈ దాడిలో ఆశ్విని కుమార్ తీవ్రంగా గాయపడటంతో స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆశ్విని కుమార్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆశ్విని తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆమె గుండెపోటుకు గురైంది. ఈ క్రమంలో తల్లీకుమారుడి అంత్యక్రియలను ఒకేసారి పూర్ణియా జిల్లాలో నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆశ్విని కుమార్ పై దాడికి పాల్పడ్డ వారిలో ముగ్గురిని బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.