లక్నో: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. కష్ట కాలంలో కరోనా రోగులకు సహాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పోలీసులు కూడా ఈ దిశగా చొరవ చూపుతున్నారు. కరోనా రోగులకు సహాయం కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. లక్నో జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) పియూష్ మోర్డియా ఈ కరోనా ఆక్సిజన్ బ్యాంక్ను శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా తాము ఆక్సిజన్ సిలిండర్లను సేకరిస్తున్నామని తెలిపారు. పలు సంస్థలు, ఫార్మా కంపెనీలు ఇందుకు సహాయం చేస్తున్నాయని చెప్పారు.
ఆక్సిజన్ అవసరమైన కరోనా రోగులకు వీటిని అందజేస్తున్నామని పియూష్ వెల్లడించారు. అవసరమైన వారు ఖాళీ సిలిండర్లను కూడా తీసుకెళ్లి నింపుకుని వినియోగించుకుని అనంతరం తిరిగి ఇవ్వవచ్చని అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీగా ఉంటే తమకు అందజేయాలని లక్నో ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.