లక్నో: తాను కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నా యాంటీబాడీలు వృద్ధి చెందలేదంటూ యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాక్సిన్ తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాతోపాటు డీసీజీఏ డైరెక్టర్, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణ ఉపాధ్యాయ్లపై ఆ వ్యక్తి ఆషియానా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈ విషయం సున్నితమైనది కావడంతో అతని ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు.
ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వాళ్లు చెప్పారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే తాను కోర్టుకు వెళ్తానని ప్రతాప్ చంద్ర అనే ఆ వ్యక్తి హెచ్చరించాడు. తాను ఏప్రిల్ 8న కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నానని అతడు చెప్పాడు. 28 రోజుల తర్వాత రెండో డోసుకు వెళ్తే ఆరు వారాల తర్వాత రమ్మన్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ఈ వ్యవధిని ప్రభుత్వం 12 వారాలకు పెంచింది.
అయితే తొలి డోసు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్లో తాను యాంటీబాడీ జీటీ టెస్టు చేయించుకున్నానని, తనలో యాంటీబాడీలు వృద్ధి చెందలేదని తేలినట్లు అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొవిషీల్డ్ తొలి డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పిన మాటలను ఈ సందర్భంగా అతడు ప్రస్తావించాడు.
యాంటీబాడీలు వృద్ధి చెందకపోగా తాను అనారోగ్యానికి గురయ్యాయని, తనలో ప్లేట్లెట్లు సగానికి పడిపోయాయని కూడా చెప్పాడు. మరి అతని ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో లేదో చూడాలి.