మహబూబాబాద్ రూరల్/ గూడూరు, జూలై 9 : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా మారి సీజనల్ వ్యాధుల బెడద తప్పిందని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి, సీత్లాతండా, ఉత్తరతండా, గూడూరు మండలంలోని ఏపూర్ గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను సందర్శించారు. ఆయా గ్రా మాల్లో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమా ల్లో ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏళ్లు గా పేరుకుపోయిన పారిశుధ్యం పల్లెప్రగతితో పూర్తి గా తొలగిపోయి అభివృద్ధి బాట పట్టాయన్నారు. కోతుల బెడద ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పండ్ల మొక్కలను నాటించాలన్నారు. ప్రకృతి వనాలను మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే జిల్లా ను ప్రథమస్థానంలో నిలుపాలన్నారు.
శభాష్ సర్పంచ్ గారు..
‘కొత్తగా ఏర్పడిన ఏపూర్ గ్రామం తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రగతిని సాధించి రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.. ఇక్కడ జరిగిన అభివృద్ధిని రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు వివరిస్తా.. గ్రామ పంచాయతీలోని ఆటస్థలం, ఓపెన్జిమ్, పల్లెప్రకృతి వనం బాగున్నాయి.. హైదరాబాద్ నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. శభాష్ సర్పంచ్, కార్యదర్శి’ అని వారిని మెచ్చుకున్నారు. మారుమూల గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం బాగుందన్నారు. పల్లెప్రగతితో తెలంగాణలోని పల్లెలు ఎలా అభివృద్ధి చెం దుతున్నాయో తెలుపడానికి ఏపూర్ గ్రామం మం చి ఉదాహరణ అని సర్పంచ్ మౌనిక, కార్యదర్శి రజితకు షేక్హ్యాండ్ ఇచ్చారు. ప్రకృతి వనంలో ప్రత్యేకంగా పెంచుతున్న యాపిల్ మొక్కల గురించి ఆరా తీశారు.
గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కేంద్రంలో ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు. ఏపూర్ గ్రామానికి స్పెషల్ గ్రాంట్ నుంచి నిధులిచ్చి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కలెక్టర్ తెలిపారు. మహబూబాబాద్లో సర్పంచ్లు సందా వీరన్న, కాంతికిషన్నాయక్, అజ్మీరా మౌనిక, ఎంపీటీసీ వాంకుడోత్ రోజానాగరాజు, వేణు, కిషన్, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, ఎంపీడీవో రవీందర్, ఎంపీవో హరిప్రసాద్, ఎస్బీఎం నోడల్ అధికారి శ్రవణ్, ఏపీఎం తిలక్, వార్డ్ సభ్యులు గోపీ, బిక్కు, జనార్దన్, లాల్, వాల్యా, శాంతి, మంగ్త్యా, గూడూరులో మండల ప్రత్యేకాధికారి ఛత్రునాయక్, జడ్పీ సీఈవో అప్పారావు, తహసీల్దార్ శైలజ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీటీసీ సరిత, ఉపసర్పంచ్ మల్లేశ్ పాల్గొన్నారు.
పాపా.. పెద్దయ్యాక ఏం అవుతావ్?
ఏపూర్ గ్రామ పార్కులో ఉన్న ఓ చిన్నారి వద్దకు వెళ్లి పాపా ఎలా ఉన్నావు?.. పార్కుకు రోజూ వస్తావా? ఇక్కడ ఎలా ఉంది? బాగా చదువుకోవాలని, పెద్దయ్యాక ఏమవుతావని ప్రియాంక ప్రశ్నించారు. దీంతో ఆ చిన్నారి పార్కు చాలా బాగుందని, పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ను అవుతానని తెలుపగా చిన్నారిని అభినందించారు.