న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రైవేట్ మార్కెట్లో ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ ధరలను పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ.400, ప్రైవేట్ దవాఖానలకు ఒక డోసుకు రూ.600 చొప్పున టీకాను విక్రయిస్తామని వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడానికి కేంద్రం ఇటీవల మూడో విడుత మార్గదర్శకాలను విడుదల చేయడం తెలిసిందే. దీంట్లో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు 50 శాతం టీకాలను కేంద్రానికి ఇవ్వాలని, మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు బహిరంగ మార్కెట్లో నేరుగా విక్రయించుకోవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీరమ్ తాజా ప్రకటన చేసింది. వచ్చే రెండు నెలల్లో ఉత్పత్తిని పెంచి వ్యాక్సిన్ కొరతను అధిగమిస్తామని పేర్కొంది. ప్రపంచంలోని ఇతర టీకాల ధరలతో పోలిస్తే, తమ వ్యాక్సిన్ అందుబాటు ధరలోనే ఉన్నదని పేర్కొంది. అమెరికా టీకాలు ఒక్కో డోసుకు రూ.1,500, రష్యా, చైనా టీకాలు ఒక్కో డోసుకు రూ.750 చొప్పున విక్రయిస్తున్నట్టు గుర్తుచేసింది. నాలుగైదు నెలల్లో రిటైల్ మార్కెట్లోనూ టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.
సీరమ్ టీకా రేట్లను తప్పుబట్టిన ప్రతిపక్షాలు
కేంద్రానికి ఒక్కో టీకా డోసును రూ.150కే పంపిణీ చేస్తున్న సీరమ్.. రాష్ర్టాలకు డోసుకు రూ.400 చొప్పున చార్జ్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై సీరమ్ సీఈవో అదర్ పూనావాలా స్పష్టతనిచ్చారు. 10 కోట్ల టీకా డోసుల సరఫరాలో భాగంగా ఒక్కో డోసుకు రూ.150 చొప్పున చార్జ్ చేస్తామని కేంద్రంతో గతంలో ఒప్పందం చేసుకున్నామని, అది ముగియగానే కేంద్రం నుంచి కూడా డోసుకు రూ.400 చొప్పున చార్జ్ చేస్తామని వివరించారు.