పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ, మే 25: కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించి కోలుకున్న వ్యక్తుల్లో… కొన్ని నెలల తర్వాత కూడా యాంటిబాడీలు ఉత్పత్తి చేసే రోగనిరోధక కణాలు ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు… జీవితకాలం పాటు కూడా ఆ కణాలు మనుగడలో ఉండి, యాంటిబాడీలను సృష్టించగలవని కూడా పరిశోధకులు తెలిపారు. ఈ యాంటిబాడీలే కరోనా వైరస్ను ఎదుర్కొంటాయి. అమెరికాలోని సెయింట్ లూయీస్లో ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్స్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. దాని వివరాలు జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. స్వల్పంగా కరోనా సోకి కోలుకున్న వారికి దీర్ఘకాలం యాంటిబాడీల రక్షణ లభిస్తుందని ఆ పరిశోధన తెలిపింది. కొందరు వ్యక్తుల్లో తొలిసారిగా కరోనా లక్షణాలు కనిపించిన 11 నెలల తర్వాత కూడా యాంటిబాడీలను ఉత్పత్తి చేసే కణాలను గుర్తించినట్టు పేర్కొంది. ‘ఈ కణాలు సజీవంగా ఉండి, జీవితకాలం యాంటిబాడీలను ఉత్పత్తి చేస్తుంటాయి. రోగ నిరోధక శక్తి సుదీర్ఘకాలం ఉంటుందనడానికి ఇదే సాక్ష్యమ’ని వివరించింది.