సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 1 : జిల్లా దవాఖానలో త్వరలో 20బెడ్ల వెంటిలేటర్ సౌకర్యం కొవిడ్ బాధితుల కోసం అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ రాజుగౌడ్ తెలిపారు. శనివారం జిల్లాలోని జోగిపేట, నారాయణఖేడ్ ఏరియా దవాఖానలను ఆయన సందర్శించారు. ఏరియా దవాఖానల్లో కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజుగౌడ్ మాట్లాడారు. డాక్టర్లు, సిబ్బంది కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిచాలన్నారు. జిల్లాలోని జోగిపేట ఏరియా దవాఖానల్లో 40 ఆక్సిజన్ బెడ్ల సౌకర్యం, 30 ఐసొలేషన్ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో 20 ఆక్సిజన్ బెడ్లు, 20 ఐసొలేషన్ బెడ్లు, జహీరాబాద్ ఏరియా దవాఖానలో 20 ఆక్సిజన్, 30 ఐసొలేషన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్ ఏరియా దవాఖానల్లో కొవిడ్ పేషెంట్ల కోసం రెమ్డెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆక్సిజన్, ఐసొలేషన్ సౌకర్యాలు ఆయా దవాఖానల్లో కొవిడ్ పేషెంట్లు వినియోగించుకోవాలని కోరారు. త్వరలో జిల్లా దవాఖానలో 20 బెడ్ల వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. జిల్లా కేంద్ర దవాఖానలో 200 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.