యాత్రను ప్రారంభించిన స్వరూపానందేంద్ర
31న తిరుమల శ్రీనివాసుడి దర్శనంతో ముగింపు
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ధర్మజాగృతి కోసం దళిత గిరిజనులతో విశాఖ శారదాపీఠం చేపట్టిన తిరుమల యాత్ర ప్రారంభమైంది. చిన్నముసిడివాడ శారదాపీఠం నుంచి 25 బస్సుల్లో దళిత గిరిజన భక్తులు తిరుమలకు బయలుదేరారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. సింహాచలం తొలిపావంచా వద్ద స్వాత్మానందేంద్ర సరస్వతి యాత్రను తిరిగి మొదలుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ యాత్ర 31వ తేదీన తిరుమల శ్రీనివాసుడి దర్శనంతో ముగుస్తుంది. హిందూమత ప్రచారాన్ని ఉద్యమరూపంలో ముందుకు తీసుకెళ్తామని స్వరూపానందేంద్ర చెప్పారు. శారదాపీఠం యావత్ భారతదేశానిదని, గిరిజన భక్తులను తిరుమల తీసుకెళ్లటం ఆనందంగా ఉన్నదని అన్నారు. దేవాదాయ భూముల పరిరక్షణలో శారదాపీఠం ముందుంటుందని పేర్కొన్నారు. ఏటా దళిత గిరిజనులను తిరుమల యాత్రకు తీసుకెళ్లి అందరికీ దేవుని అనుగ్రహాన్ని కల్పిస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యటన పూర్తయిందని తెలిపారు. త్వరలో ఆయన భారతదేశ యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలో స్వాత్మానందేంద్ర యాత్రకు సీఎం కేసీఆర్ బ్రహ్మండంగా సహకరించారని పేర్కొన్నారు. స్వాత్మానందేంద్ర హిందూ ధర్మ ప్రచారయాత్రలో దేవాలయ వ్యవస్థకు సంబంధించిన అనేక లోపాలను గుర్తించారని తెలిపారు. తాము గుర్తించిన లోపాలతో ఒక నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. 30 ఏండ్లుగా హైందవ ధర్మం కోసం శారదాపీఠం పోరాడుతున్నదని వెల్లడించారు.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిధుల గోల్మాల్పై డీసీసీబీ సీరియస్