ప్రజారోగ్యంపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంది
అవసరమైతే పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా ఎంజీఎం
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
ఎంజీఎం అధికారులు, వైద్యులతో సమీక్ష
‘నమస్తే తెలంగాణ’ కథనాలపై స్పందన
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్19 : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ సంపూర్ణ బాధ్యతతో వ్యవహరిస్తుందని, దేశంలో ఎక్కడాలేని విధంగా కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన వరంగల్ ఎంజీఎం దవాఖానను సందర్శించారు. ‘ఎంజీఎంలో దొంగలు పడ్డారు’, ‘అత్యవసరం పేరుతో అక్రమదందా’ అనే శీర్షిన ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావును కోరారు. దీంతో మంత్రి ఈటల రాజేందర్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, పలు విభాగాధిపతులతో సమీక్షించారు. ముందు గా ఆయన వైద్యసేవలకు అవసరమైన వసతులు, మందులు తదితర వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంజీఎంలో అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తలను ప్రస్తావిస్తూ శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. 1370 బెడ్లు ఉన్న ఎంజీఎం దవాఖానలో సుమారు 440 బెడ్లతో కొవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
కరోనాను కట్టడికి ప్రభుత్వం మొదటి నుంచి చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నదన్నారు. 100 వెంటిలేటర్లు, 100 పడకలతో ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను గతంలోనే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైతే అత్యవసర సేవలను మినహాయించి, అన్ని రకాల సేవలు నిలిపివేసి పూర్తిస్థాయి కరోనా దవాఖానగా మార్చడానికి సైతం వెనుకాడబోమన్నారు. అదేవిధంగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, ఎన్ 95 మాస్కులతో పాటుగా, ఇంజక్షన్లు, ఆరు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వ చేసుకునే సామర్థ్యమున్న ట్యాంకులు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదన్నారు. లక్షణాలు కనిపించి రాపిడ్ టెస్టులో నెగెటివ్గా వచ్చిన వారికి మాత్రమే ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తారని అన్నారు. ప్రస్తుతం వరంగల్ కేఎంసీలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్లో రోజుకు సు మారు 500 టెస్టులు చేస్తున్నారని, దానిని రెట్టింపు చేయాలని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యను ఆదేశించినట్లు తెలిపారు. కరోనా సోకిన 95శాతం మంది హోంఐసొలేషన్లో చికిత్స తీసుకుంటున్నారని, అత్యవసర స్థితిలో ఉన్న వారు మాత్రమే దవాఖానలో చేరాలన్నారు. చివరిక్షణంలో వచ్చిన వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, కనీస రోగ నిరోధకశక్తి లేని వారి మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలని, తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా చేయొద్దని కోరారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజులో 27 మంది మృతి
ఒప్పో నుంచి తక్కువ ధరకే 5G స్మార్ట్ఫోన్