వాషింగ్టన్: భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా ఉద్రిక్త ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. సరిహద్దు వద్ద చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. దీని కోసం ప్రాంతీయ దేశాలపైన కూడా డ్రాగన్ వత్తిడి తెస్తున్నట్లు అగ్రరాజ్యం చెప్పింది. గత ఏడాది మే నెలల రెండు దేశాల మధ్య గాల్వన్ ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాలు చర్చల ద్వారా తమ బలగాలను వెనక్కి రప్పించినా.. బోర్డర్ వద్ద మాత్రం టెన్షనే ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
దక్షిణ చైనా సముద్ర జలాలపై పట్టు కోసం ప్రాంతీయ దేశాలను చైనా బెదిరిస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. దక్షిణాసియా దేశాలపై డ్రానగ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు చెప్పింది. తూర్పు చైనా సముద్ర జలాల అంశంలో జపాన్పై పెత్తనం చెలాయిస్తున్నట్లు అమెరికా అభిప్రాయపడింది. చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. గతంలో కన్నా ఎక్కువ వేగంతో అణ్వాయుధాలను చైనా సమకూర్చుకుంటున్నదని, మరో పదేళ్ల కాలంలో తన న్యూక్లియర్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోనున్నట్లు అగ్రరాజ్యం చెప్పింది.
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగడం కష్టమే అని, కానీ రెండు దేశాల మధ్య మాత్రం వైరం మరింత ముదురుతుందని అమెరికా హెచ్చరించింది.