ధర్మారం, మార్చి 25: చారిత్రక సంపద, అనేక సహజ సిద్ధ అందాలతో విలసిల్లుతున్న నంది మేడారం గ్రామం పర్యాటక సొబగులద్దుకుంటున్నది. ఇక్కడ కాకతీయ రెండో రాజు అయిన మేడరాజు పాలించారని, అందుకే మేడారంగా.. కాకతీయ చిహ్నంగా భావించే నంది విగ్రహం ఉండడం వల్లే నంది మేడారంగా పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గ్రామంలోని పెద్ద చెరువు కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్గా రూపుదిద్దుకొని చుట్టూ గుట్టలతో ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుండగా, తాజాగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం శోభాయమానంగా తయారైంది. పిల్లల కోసం వివిధ రకాల ఆట వస్తువులు, వనం చుట్టూ తిరిగేందుకు బీటీ రోడ్లు, తీరొక్క పూలు, అలంకరణ మొక్కలతో ఏడెకరాల విశాలమైన స్థలంలో వేలాది మొక్కలతో రాష్ట్రంలోనే మోడల్గా ఆవిష్కృతమై, ఉద్యానవనాన్ని తలపిస్తున్నది.
ఏడెకరాల స్థలంలో పల్లె ప్రకృతివనం..
నంది మేడారంలోని పెద్ద చెరువును కాళేశ్వరం ప్రాజెక్టు కింద నంది రిజర్వాయర్గా విస్తరించారు. పాత చెరువు కట్ట ప్రాంతం నుంచి సుమారు 300 మీటర్ల దూరం వదిలి కొత్త కట్టను నిర్మించారు. దీంతో శిఖం భూమి ఎక్కువ విస్తీర్ణంలో మిగిలిపోవడంతో ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని మంత్రి ఈశ్వర్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా దాదాపు రెండు నెలల క్రితం అమరేశ్వర ఆలయం పక్క నుంచి పాత శిఖం భూమితోపాటు గుట్టబోరును సైతం పది ఎకరాల మేర చదును చేయించారు. అందులో మూడెకరాలను నూతన జీపీ భవనం, రైతు వేదిక, హరితహారం నర్సరీ కోసం కేటాయించి, ఏడెకరాల్లో ‘ప్రకృతి వనం’ ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం కింద పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, పూలు, అలంకరణ మొత్తం 25 రకాలైన 22,277 మొక్కలు నాటించారు.
ఎంపీపీ కరుణశ్రీ, జడ్పీటీసీ పద్మజ, ఎంపీడీవో జయశీల ఆధ్వర్యంలో సర్పంచ్ సామంతుల జానకి శంకర్, పాలకవర్గ సభ్యులు నిత్య పర్యవేక్షణతో త్వరగా పనులు పూర్తిచేయించారు. పార్కును రెండు విభాగాలుగా చేసి ఓ వైపు మియావాకి విధానంలో మరోవైపు ఆకర్షణీయ పద్ధతిలో తీర్చిదిద్దారు. కాగా, పార్కు హద్దుల్లో నాటిన కోనో కార్పస్ మొక్కలు ఏపుగా పెరిగి ముచ్చటగొలుపుతున్నాయి. పార్క్ మధ్యలో ప్రత్యేకంగా రాళ్ల తెట్టె ఏర్పాటు చేసి మధ్యలో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. పైప్లైన్ వేయించి నీటి సౌకర్యం కల్పించారు. 42 నల్లాలు బిగించారు. వనంలో అంతర్గత రోడ్లను నిర్మించి వాకింగ్ ట్రాక్లు వేశారు.
ప్రత్యేక నిధుల కేటాయింపు..
ప్రకృతివనం పూర్తి స్థాయి అభివృద్ధికి మంత్రి ఈశ్వర్ అదనంగా 25 లక్షలు కేటాయించారు. స్వాగత ద్వారంతో పాటు పార్కు మధ్యలో గేటు, పిల్లల కోసం ఆటవస్తువులు, సిమెంట్ బెంచీలు, యువకుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించగా, ఈ ఉద్యానవనం నిత్యం ప్రజలతో సందడిగా మారింది. కాగా, పార్క్ నిర్మాణంతో ఉపాధి కూలీలకు చేతినిండా పనిదొరికింది. దాదాపు 1,076 మంది కూలీలు పనులు చేయగా, 5 నెలల పాటు శ్రమించి పార్కును తీర్చిదిద్దినట్లు ఎంపీడీవో జయశీల తెలిపారు. రాష్ట్రంలోనే మోడల్గా ఆవిష్కృతమైన ఈ వనాన్ని హైదరాబాద్ హైబుజ్ ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థ పరిశీలించి ఆశ్చర్యపోయింది. పర్యాటక కేంద్రంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది.