చండీగఢ్, మే 21: చట్టబద్ధంగా వివాహం చేసుకొన్నవారికి లభించే అన్ని హక్కులు సహజీవనంలో ఉన్న జంటకు కూడా వర్తిస్తాయని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రేమలో ఉన్న ఇద్దరు సహజీవనం చేస్తూ రక్షణ కోరితే కల్పించాల్సిందే అని స్పష్టంచేసింది. హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన ఓ జంట.. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ సుధీర్ మిట్టల్ విచారణ జరిపారు. ‘జీవితభాగస్వామిని ఎంచుకోవడం రాజ్యాంగపరమైన హక్కు. పెండ్లి చేసుకోనంత మాత్రాన వారి జీవితానికి, స్వేచ్ఛకు భంగం కలగనివ్వకూడదు’ అని స్పష్టం చేశారు. అయితే ఇదే హైకోర్టులోని మరో ధర్మాసనం.. ఈ నెలలోనే ఇలాంటి నేపథ్యం ఉన్న రెండు కేసుల్లో భిన్నమైన తీర్పులు ఇవ్వడం గమనార్హం.