న్యూఢిల్లీ: కరోనా సోకిన వృద్ధుడ్ని ఒక కుటుంబం ఇంట్లో ఒంటరిగా వదిలేసింది. ఆయన కుమార్తె సమాచారంతో స్పందించిన పోలీసులు అతడ్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. మురళీధర్ అనే 80 ఏండ్ల వ్యక్తి ఢిల్లీ పాత రాజేంద్రనగర్ ప్రాంతంలోని ఒక భవనంలో నివాసం ఉంటున్నారు. కరోనా సోకిందన్న భయంతో ఆయనను ఇంట్లో ఒంటరిగా వదిలేసి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు.
మరోవైపు మురళీధర్కు చెందిన ఒక కుమార్తెకు ఈ విషయం తెలియడంతో పోలీసుల సహాయం కోరారు. దీంతో కానిస్టేబుల్ రాజు రామ్ ఆయన ఇంటికి వెళ్లారు. నేను చనిపోతే.. నా మృతదేహాన్ని పోలీసులకు అప్పగించండి అని డోర్ బయట ఉన్న పోస్టర్ను చూసి చలించిపోయారు. మురళీధర్ను కలిసి ఆయన గురించి ఆరా తీయగా మాజీ సీఐడీ అధికారి అని తెలిసింది. చివరకు ఆయనను ఒప్పించి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
మురళీధర్కు ముగ్గురు కుమార్తెలని పోలీసులు తెలిపారు. ఒకరు విదేశాల్లో ఉండగా ఇద్దరు ఢిల్లీలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఆయనను ఒంటరిగా వదిలేసిన కుటుంబ సభ్యుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.