గాంధీ వైద్యశాలలో వైద్య విద్య పూర్తి చేసిన కరోనా బ్యాచ్ చరిత్రలో మిగిలిపోతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన 2015 బ్యాచ్కు చెందిన 200 మంది వైద్యవిద్యార్థులకు మంగళవారం రాత్రి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పూర్వం అమెరికా, లండన్ వెళ్లిన వైద్యులు తాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చామని చెప్పేవారని, ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీ నుంచి వచ్చామని అంతకంటే ఎక్కువగా గర్వపడుతున్నారని అన్నారు. కరోనా విపత్కర సమయంలో కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాని సందర్భంలో గాంధీ డాక్టర్లు కొవిడ్ రోగులకు అందించిన సేవలు ఎంతో గొప్పవని అన్నారు.
క్యూబా దేశం మాదిరిగా మనదేశంలో అత్యధిక డాక్టర్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ చేరుకున్నదని అన్నారు. వైద్య విద్యార్థులకు థియరీతోపాటు ప్రాక్టికల్స్ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. రోగులతో ప్రేమగా ఉండాలని, పేదవారికి మేమున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీర్వాదం వల్ల ఈ రోజు డాక్టర్ కావాలన్న కల నెరవేరిందని అన్నారు. కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.ప్రకాశ్రావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సులేమాన్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు పాల్గొన్నారు.