న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పంజా విసురుతోంది. రోజు వేలాది కేసులు వస్తుండడంతో హాస్పిటళ్లకు రోగులు క్యూ కడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల మధ్య పలువురు వైద్యులు మహమ్మారి బారినపడుతున్నారు. ఢిల్లీలోని సరోజ్ హాస్పిటల్లో 80 మంది వైద్యులు కరోనా పాజిటివ్గా పరీక్షించడం కలకలం రేపుతోంది. ఇందులో 12 మంది వైద్యులు ఇంట్లో ఐసోలేషన్లో ఉండగా.. 12 మంది చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రిలో సీనియర్ సర్జన్ డాక్టర్ ఏకే రావత్ కరోనాతో మరణించారు. ఆయన 27 సంవత్సరాల పాటు సరోజ్ హాస్పిటల్లో సేవలందించారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో 300 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు కొవిడ్ పాజిటివ్గా పరీక్షించినట్లు తేలింది. ప్రస్తుతం సరోజ్ హాస్పిటల్లో అవుట్ పేషెంట్ (ఓపీడీ) సేవలు నిలిపివేశారు. ఆదివారం ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ (జీటీబీ) హాస్పిటల్లో ఓ యువ వైద్యుడు అనాస్ ముజాహిద్ (26) కొవిడ్ సంబంధిత సమస్యలతో మృత్యువాతపడ్డాడు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో నిన్న ఒకే రోజు 13,336 కొవిడ్ కేసులు నమోదవగా.. 273 మంది కన్నుమూశారు.