న్యూఢిల్లీ, నవంబర్ 24: పాకిస్థాన్ కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమితులయ్యారు. 2019లో జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో భారత సైన్యంపై జరిగిన ఉగ్రదాడికి ఇతడే వ్యూహకర్త అని ఆరోపణలు ఉన్నాయి. పుల్వామా ఉగ్రదాడి సమయంలో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ చీఫ్గా మునీరే ఉన్నాడు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు మునీర్ బద్ద విరోధి. ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సైన్యాధ్యక్షుడు బజ్వా స్థానంలో మునీర్ను పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నియమించినట్టు సమాచార శాఖ మంత్రి ట్వీట్చేశారు.
నంబర్వన్ గూఢచారి
మునీర్కు అత్యంత విజయవంతమైన గూఢచారిగా పాకిస్థాన్లో పేరున్నది. ఆ దేశంలో అత్యున్నతమైన గూఢచారి సంస్థలైన ఐఎస్ఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) రెండింటికీ నాయకత్వం వహించారు. పుల్వామా దాడికి మునీరే వ్యూహరచన చేశాడని భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా పనిచేసిన తిలక్ దేవాశర్ తెలిపారు.