న్యూఢిల్లీ, జూలై 6: గిరిజన హక్కుల నేత స్టాన్ స్వామి మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు 10 ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో స్వామిని నిర్బంధించి, అమానవీయంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఎంకే స్టాలిన్ (తమిళనాడు), సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డీ రాజా, సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉన్నారు. ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడైన స్టాన్ స్వామి గత ఏడాది నుంచి విచారణ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు.
ఐరాస మానవ హక్కుల సంఘం విచారం
స్టాన్ స్వామి మృతి కలచివేసిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి విచారం వ్యక్తం చేసింది. చట్టపరంగా తగిన ప్రాతిపదిక లేకుండా అరెస్ట్ చేసిన వ్యక్తులను విడుదల చేయాలని భారత్తో పాటు అన్ని దేశాలకు సూచించింది. స్వామితో పాటు మరో 15 మంది మానవ హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని సమితి మానవ హక్కుల హైకమిషనర్, నిపుణులు పలుమార్లు కోరారని పేర్కొంది.
విమర్శలకు కేంద్రం ఖండన
స్టాన్ స్వామి మృతితో కేంద్ర ప్రభుత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ స్పందించింది. మానవ హక్కుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారే కానీ మానవ హక్కులను అడ్డుకోరని తెలిపింది.