న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటి వరకు 21.58 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఒకే రోజు 18-44 ఏళ్లలోపు సంవత్సరాలున్న వారు 12,23,596 మంది మొదటి మోతాదు, 13,402 మంది రెండో మోతాదు అందుకున్నారని పేర్కొంది. మూడో దశ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా 2,02,10,889 మందికి వారి మొదటి, 23,491 మందికి రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. బిహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పది లక్షలకుపైగా లబ్ధిదారులకు మొదటి మోతాదు అందిందని చెప్పింది.
దేశంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ డ్రైవ్ సోమవారం రాత్రి అందిన వివరాల మేరకు 21,58,18,547 డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్ సోమవారం నాటికి 136వ రోజుకు చేరుకోగా.. ఒకే రోజు 25,52,501 వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 22,75,324 మంది లబ్ధిదారులకు మొదటి మోతాదు.. మరో 2,77,177 మందికి సెకండ్ డోస్ వేసినట్లు వివరించింది.