శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్లోని చెక్సాదిఖ్ ఖాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ ఇష్ఫక్ దార్ అలియాస్ అబూ అక్రమ్తోపాటు మరో ఉగ్రవాది చనిపోయాడని తెలిపారు. అబు అక్రమ్ కశ్మీర్ లోయలో 2017 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.