ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం..
రైతుల్లో ఆనందం
సాగు పనులు మరింత ముమ్మరం
నమస్తే నెట్వర్క్ :తొలకరికి ముందే భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. దీంతో సాగు పనులను మరింత ముమ్మరం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. నిన్న మొన్నటి వరకు ఉక్కపోత, ఎండవేడితో ఇబ్బందులు పడ్డ ప్రజలు వాతావరణంలోని మార్పులతో ఉపశమనం పొందినట్లయ్యింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది..
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో గంట పాటు వర్షం కురిసింది. సిరికొండ మండల కేంద్రంతో పాటు రాంపూర్, పొన్న,రాయిగూడ, కొండాపూర్, రిమ్మ, వాయిపేట్, ఫకీర్ నాయక్ తండా తదితర గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది.పలుచోట్ల వడ గండ్లు పడ్డాయి. భీంపూర్ మండలంలో మోస్తరుగా వర్షం కురిసింది. ఎగువన మహారాష్ట్రలో కూడా వర్షాలు కురిస్తే పెన్గంగకు వరద వస్తుందని, గంగమార్గంలో సరిహద్దు గ్రామాల వారు రాకపోకలు మానుకోవాలని సర్పంచ్లు సూచిస్తున్నారు. గుడిహత్నూర్ మండలంలో మధ్యాహ్నం గంటన్నరపాటు వర్షం కురిసింది. నార్నూర్ మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉట్నూర్ మండలంలో గాలిదుమారంతో పాటు భారీ వర్షం కురిసింది. పంట పొలాలోప్ల వర్షపు నీరు నిలిచింది. ఇంద్రవెల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో చిన్నారులు వర్షంలో తడుస్తూ కేరింతలు వేశారు. మండలంలో రెండో సారి భారీ వర్షం కురవడంతో రైతులు తమ పనులను ముమ్మరం చేశారు. భారీ వర్షానికి మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ వద్ద రోడ్డుపై చెట్లు కూలింది. ఎస్ఐ నాగ్నాథ్ జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం అర గంటపాటు భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు వరదతో ప్రవహించాయి. మండల కేంద్రంలోని భీమన్న చెరువులోకి వరద చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.కుంటాల మండలంలో భారీ వర్షం కురిసింది.
కుంటాల, అందకూర్ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. భైంసా మండలంలో ఒక్కసారిగా మబ్బు లు కమ్ముకొని దాదాపు రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం గంటన్నర సేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లాక్డౌన్ సడలింపు సమయంలో జిల్లా కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. అప్పపెల్లిలోని కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగజ్నగర్ పట్టణంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన కాలువలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ చౌరస్తా , నౌగాం బస్తీ, తిరందాస్ కాలనీ, సంజీవయ్య కాలనీ, ద్వారకానగర్లో వర్షపు నీరు ప్రవహించింది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. విద్యుత్ అంతరాయం ఏర్పడింది.