నిర్మల్ టౌన్, ఏప్రిల్ 27: నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, సారంగాపూర్, దిలావర్పూర్, మామడ, తదితర మండలాల్లో సోమవారం గాలిదుమారంతో కూడిన చిరుజల్లులు రైతులను ఆందోళనకు గురి చేశాయి. యాసంగిలో సాగు చేసిన మక్కజొన్న, వరి, జొన్న, సజ్జలు పంట కళ్లాల్లో ఎండబెడుతున్న సమయంలో ఒక్కసారిగా సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రైతులు పంటను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. వర్షం కారణంగా మక్క,జొన్న, సజ్జ, ఇతర పంటలు తడిసిపోయాయి. రంగుమారే పరిస్థితి ఉండడంతో రైతులు పంటను కళ్లాల్లోనే ఆరబెట్టారు. గాలిదుమారం వల్ల మామిడి నేలరాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది.
తడిసిన ధాన్యం
ఖానాపూర్టౌన్, ఏప్రిల్ 27: ఖానాపూర్ పట్టణంతో పాటు, మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులకు చెట్ల కొమ్మలు కరెంటు తీగలపై విరిగి పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. ఈదురుగాలులతో పాటుగా చిరుజల్లులు కూడా కురవడంతో ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు కోరారు.
చల్లబడ్డ వాతావరణం…
భైంసా టౌన్, ఏప్రిల్ 27: ఎండ, వేడితో అల్లాడుతున్న జనానికి సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఉపశమనం లభించినట్లయ్యింది. సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దాదాపు 2 గంటల పాటు కురువడంతో వాతావరణం చల్లబడింది.