న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఏ బోబ్డే మాట్లాడుతూ.. ప్రధాన న్యాయమూర్తిగా తన శక్తి మేర విధులు నిర్వర్తించాననే సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఎన్నో జ్ఞాపకాలు, సంతోషం, సద్భావనతో సుప్రీంకోర్టును విడిచి వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా చివరి రోజు మిశ్రమ అనుభూతిని మిగిల్చిందన్నారు. న్యాయమూర్తిగా 21 సంవత్సరాలు విధులు నిర్వహించిన తర్వాత తాను పదవి నుంచి వైదొలగుతున్నాని, ఈ కాలం తనకు చాలా జ్ఞాపకాలను మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యారు. సోదర న్యాయమూర్తులతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందన్నారు. తన స్థానంలో బాధ్యతలు చేపడుతున్న జస్టిస్ ఎన్వీ రమణ తన విధులను సమర్థంగా నిర్వహిస్తారని వ్యాఖ్యానించారు.
కరోనా సమయంలో జస్డిస్ బోబ్డే ప్రారంభించిన వర్చువల్ విచారణతో 50 వేల కేసులు పరిష్కారమైనట్టు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కొనియాడారు. ఇది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. జస్టిస్ బోబ్డే తెలివైన, వివేకవంతమైన న్యాయమూర్తి అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసించారు. జస్టిస్ బోబ్డే అయోధ్య సహా పలు చారిత్రాక కేసుల్లో తీర్పులు వెల్లడించారు. 47వ సీజేఐగా 2019, నవంబర్ నెలలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే బాధ్యతలు స్వీకరించారు.