ప్రముఖ వైరాలజిస్టు గగన్దీప్ కాంగ్
న్యూఢిల్లీ, మే 26: కరోనా ఉత్పరివర్తనాలు పెరగకుండా అడ్డుకట్ట వేసి వైరస్ను అంతం చేయాలంటే వేగవంతమైన వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రముఖ వైరాలజిస్టు గగన్దీప్ కాంగ్ అన్నారు. ‘సామూహిక వ్యాక్సినేషన్ తప్పు’ అని ఫ్రెంచ్ వైరాలజిస్టు, నోబెల్ గ్రహీత ల్యూక్ మాంటగ్నైర్ అన్నట్టు వచ్చిన వార్తలపై ఆమె ఈ మేరకు స్పందించారు. వ్యాక్సిన్ వేసుకొన్న అందరూ చనిపోతారని మాంటగ్నైర్ అనలేదని కాంగ్ స్పష్టం చేశారు. అయితే ‘వ్యాక్సిన్ వేసుకొన్నవారికి కొత్త మ్యుటెంట్ సోకితే వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరగొచ్చు’ అని మాంటగ్నైర్ అన్నారని.. కానీ ‘అది తప్పు’ అని కాంగ్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకొన్నవారికి కొత్త వైరస్ సోకినపుడు ‘టీకా వైరస్ పునరుత్పత్తిని ఆపుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గించి నయం చేస్తుంది’ అని స్పష్టం చేశారు.