కోల్కతా: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లగానే నేతలు దేశం విడిచి పారిపోయారని, కానీ సామాన్య ప్రజలు, మహిళలు, చిన్నారులు, నిరుపేదలు మాత్రం సాయుధుల ఆగడాలకు బలవుతున్నారని ఆలిండియా పఖ్తూన్ జిగ్రా ఇ హింద్ అధ్యక్షురాలు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మనవరాలు యాస్మిన్ నిగర్ ఖాన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఓ జాతియ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలకు బలవుతున్న వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా తాలిబన్ అస్సలు నమ్మవద్దని యాస్మిన్ నిగర్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ‘తాలిబన్లను అస్సలు నమ్మవద్దు. వాళ్లు ఇవాళ ఒకటి చెబుతారు, రేపు ఇంకోటి చేస్తారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు ప్రపంచదేశాధినేతలను నేను ఒక్కటే కోరుతున్నా.. యుద్ధాలతో విధ్వంసమైన సిరియా, పాలస్తీనా విషయంలో ఎలా వ్యవహరించారో ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ విషయంలో కూడా అలాంటి సహకారమే అందించండి’ అని యాస్మిన్ విజ్ఞప్తి చేశారు.