న్యూఢిల్లీ: న్యాయ వృత్తిని సంపన్నుల ప్రొఫెషనల్ వృత్తిగా భావించేవాళ్లు అని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవాళ ఆయన్ను సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో జడ్జిల ఖాళీలు భారీ సంఖ్యలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కోర్టుల్లోనూ మౌలికసదుపాయాలు సరిగా లేవని కూడా ఆయన అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ప్రొఫెషనల్ వృత్తిలో స్థిరత్వానికి గ్యారెంటీ లేదని, కోర్టుల్లో ఉన్న మౌళికసదుపాయాల అంశాల గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. న్యాయవాద వృత్తిలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. అయితే సుప్రీంకోర్టులో ఇటీవలే 11 శాతం మహిళా ప్రాతినిద్యాన్ని సాధించినట్లు ఆయన చెప్పారు. తాను హైకోర్టులో పనిచేసిన రోజుల్లో, మహిళలకు టాయిలెట్ సదుపాయాలు లేవని, మహిళా లాయర్లు ఇబ్బందులుపడేవారని, నేను జడ్జీగా ఉన్న సమయంలో.. వనరులను కల్పించే ప్రయత్నం చేసినట్లు చీఫ్ జస్టిస్ తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల అత్యధికంగా ఒకేసారి 9 మంది జడ్జిలను సుప్రీంకోర్టుకు నియమించిన విషయం తెలిసిందే. ఇక దేశంలోని వివిధ కోర్టుకు 68 మంది జడ్జీలను సిఫారసు చేసి చరిత్ర సృష్టించింది.