నాటి నుంచి నేటి వరకు ప్రజల గొంతుకై నిలుస్తున్న పత్రిక
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక.. మానస పుత్రిక
నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం అలుపెరగని పోరాటం
నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర
ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర
సంచలనాత్మక కథనాలతో అక్రమార్కుల గుండెల్లో దడ
స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రజలు, ప్రభుత్వానికి వారధి
నేడు పదో వార్షికోత్సవం
కరీంనగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక, అప్పుడే పది వసంతాలు పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, నేడు పదకొండో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. 2011 జూన్ 6న తొలి సంచిక మొదలైనప్పటి నుంచి నేటి వరకు జనం వెంటే ఉన్నది. రాష్ట్రం సిద్ధించే వరకు ఉద్యమ పత్రికగా తెలంగాణ ప్రజలందరి ‘ప్రత్యేక’ ఆకాంక్ష కోసం అలుపెరుగని పోరాటం సాగించింది. నాటి ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కండ్లకుగట్టింది. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించింది. సీమాంధ్ర మీడియా చేస్తున్న దగాను, తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరిస్తున్న తీరును బహిర్గతం చేసింది. నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోల చిత్రాలను కండ్లముందుంచింది. 2011 సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమైన సకలజనుల సమ్మెకు సంబంధించి ‘నమస్తే’ ప్రతి రోజూ విభిన్న తీరులో కథనాలు ప్రచురించింది. సకలజనులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా స్ఫూర్తి నింపింది. సమ్మెను విజయవంతం చేసింది. స్వరాష్ట్ర ఆకాంక్షను గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలంగా వినిపించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తున్నది.
పదకొండో వసంతంలోకి ‘నమస్తే తెలంగాణ’
ఓవైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణం..
స్వరాష్ట్ర సాధన కోసం ఉధృతమైన పోరాటం.. రాస్తారోకోలు, ర్యాలీలు,
హోరెత్తిన నిరసనలు.. మరోవైపు సీమాంధ్ర కుట్రలు.. ఏ పత్రిక తిరగేసినా
విషపు రాతలు.. అలాంటి సందర్భంలోనే నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకై వచ్చింది ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక. 2011 జూన్ 6న తొలిపొదై ్దపొడిచి, తెలంగాణ వాణిని గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలంగా వినిపించింది. దశాబ్దాలుగా జరిగిన అన్యాయాలను, అవహేళనలను, అవమానాలను వివరిస్తూనే, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ఇదే సమయంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిరుపేదలు, నిర్వాసితుల గొంతుకైంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలకు, సర్కారుకు మధ్య వారధిలా ఉంటూ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది.
ఆది నుంచీ ప్రజాపక్షమే..
గడిచిన పదేళ్లలో అడుగడుగునా జనం పక్షానే నిలుస్తున్నది. ఆకాంక్షను గట్టిగా వినిపిస్తూనే జిల్లావాసులెదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమరశంఖం పూరించింది. తెలంగాణ రాక ముందు సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క, కరువు పరిహారం అందక, మద్దతు ధర దక్కక, కష్టమొచ్చిన ప్రతిసారీ అన్నదాతకు అండగా నిలబడి, అధికారుల తీరును ఎండగట్టింది. కాంట్రాక్టర్ల నిర్వాకంతో జలయజ్ఞం, జలవిఘ్నంగా మారినప్పుడు.., ‘సింగరేణి’ పదఘట్టనల కింద అమాయకుల బతుకులు ఛిద్రమైనప్పుడు.., ‘హరిత’మంటూ పుట్టుకొచ్చిన ఫ్యాక్టరీలు, ప్రజలపై కాలుష్యపు విషం చిమ్మినప్పుడు.., అధికారుల నిర్లక్ష్యంతో వివిధ ప్రభుత్వ పథకాలు నీరుగారినప్పుడు.., విద్యాశాఖ తీరుతో విద్యార్థుల చదువులు అటకెక్కినప్పుడు.., ‘సంక్షేమం’ సం‘క్షామం’లా మారి జనం అల్లాడుతున్నప్పుడు.., మద్యం మాఫియా ‘మామూళ్ల’ మత్తులో ఎక్సైజ్, పోలీస్ శాఖ తూగినప్పుడు.., రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో అవినీతి పెచ్చుమీరినప్పుడు.., ‘రియల్’ భూదందాలకు పట్టపగ్గాల్లేకుండా పోయినప్పుడు.., చారిత్రక గుట్టలపై గునపం దింపేందుకు అక్రమార్కులు తెగించినప్పుడు.., రహదారులపై అక్రమాల పగుళ్లు తేలినప్పుడు.., వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసినప్పుడు.., కొందరు పోలీసులే వడ్డీల దందా చేస్తూ పీడిస్తున్నప్పుడు.. ఇలా సందర్భమేదైనా ప్రజల పక్షాన ‘నమస్తే తెలంగాణ’ ‘కల’మెత్తి పోరాడింది. పేదలు, అసహాయులకు భరోసా ఇచ్చింది.
మనసుకు ఉల్లాసం
ఇవేగాక, ప్రతి రోజూ ప్రత్యేక శీర్షికలతో ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నది. రోజువారీగా శీర్షికలతో ‘ఇదీ మా నౌకరీ’, ‘బర్నింగ్ ఇష్యూ’, ‘ఉద్యోగపర్వం’, ‘చరిత్రకెక్కని చరిత్ర’ ‘చేను చేలక’, ‘మానేరు’, ‘అబల’, ఖేల్, ‘నవతరం’, ‘ఆదాబ్’ పేరిట వివిధ రంగాలు, వృత్తి జీవితాలు, వ్యక్తుల విజయగాథలు, చారిత్రక ప్రదేశాలు, వింతలు, విశేషాల గురించి సమగ్ర కథనాలు ఇచ్చింది. ముఖ్యంగా సీమాంధ్రుల వివక్ష కారణంగా పాఠ్యపుస్తకాలకెక్కని అసలు సిసలు జిల్లా చరిత్రను ‘చరిత్రకెక్కని చరిత్ర’ పేరుతో వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ కళాకారుల గురించి వివరిస్తూనే, ఎంతో మంది కవులు, కళాకారులను పరిచయం చేసింది. ఇక ప్రతి ఆదివారం ‘సండే స్పెషల్’ పేరిట ప్రత్యేక కథనాలను ప్రచురించింది. నాటి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, పల్లె జీవనం, జీవనశైలి, టెక్నాలజీ.. ఇలా ఎన్నింటినో ముందుంచింది. నాడు రైతు కుటుంబంలో భాగమై కనుమరుగైన ‘నేను ఎడ్లబండిని..’, ‘గొంగడి గుర్తున్నదా?’, ‘లోకల్లుకు ఫిదా’, “ఇంకా నయాబాని‘సెల్లు’, దూరమవుతున్న చుట్టాల గురించి ‘ఏడోయి అతిథి’, కుటుంబాల్లో అత్తాకోడళ్ల గొడవల గురించి ‘అమ్మా.. ఆలీ నడుమ నలిగి’, వలస కుటుంబాలపై ‘సొంతూళ్లో పరాయిలు’, పల్లె ఆటలపై ‘ఆడుదామా పల్లె ఆటలు’, అతిగా సెల్ వాడితే కలిగే నష్టాలపై ‘సెల్ హెల్’, సోషల్ మీడియాపై ‘వాట్సాప్ విప్లవం’, ఆడపిల్లలకు ప్రోత్సాహంపై ఆలోచించండి ఓ అమ్మానాన్న, ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ‘ఇల్లే బడి’, కరోనా నేపథ్యంలో ఇల్లే ఇండోర్ స్టేడియం మారడంపై ‘ఇల్లే బడి.. ఆటల ఒడి’.. ఇలా వేల సంఖ్యలో ప్రత్యేక కథనాలను ఇచ్చింది. ఇవన్నింటితోపాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం నిపుణ ఇస్తున్నది. నిపుణుల సలహాలతో విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షల సమాచారం ఇచ్చింది.
భూ బాధితులకు అండగా ధర్మగంట..
ప్రధానంగా భూసమస్యల పరిష్కారం కోసం ‘ధర్మగంట’ పేరిట ప్రత్యేక కథనాలను ప్రచురించింది. 2019 ఏప్రిల్ నెలలో రెవెన్యూలో అక్రమాలపై ప్రారంభమైన కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దాదాపు మూడు నెలలపాటు కొనసాగిన ఈ కథనాల్లో వందలాది మంది బాధితుల భూ సమస్యలను వెలుగులోకి తెచ్చింది. అందుకు కారణమైన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎండగట్టడమే కాకుండా, భూ సమస్యలకు పరిష్కారం చూపింది. ఎందరిపైనో వేటు పడింది. చివరకు ‘నమస్తే’లో కథనం వస్తే చాలు తమ సమస్య పరిష్కారమైపోతుందని భూ బాధితులు ఎదురుచూడగా, రెవెన్యూ అధికారులు, సిబ్బంది మాత్రం భయపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడి వెళ్లి క్షణాల్లో పరిష్కరించే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ధర్మగంట అంతలా ప్రభావం చూపింది. ఎన్నో అక్రమాలు వెలుగులోకిరాగా, ఆ తర్వాత సర్కారు ఏకంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
సంచలనం సృష్టించిన కథనాలు..
అవినీతి, అక్రమాలపై ప్రచురించిన ఎన్నో కథనాలు సంచలనం సృష్టించాయి. ‘మాట్లాడితే మాయం’ శీర్షికన 2011 ఆగస్టు 8న ప్రచురితమైన కథనం అప్పటి ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఓ వర్గం యువతులతో ఇతర యువకులు కనిపిస్తే కిడ్నాప్ చేసి, రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి నానా చిత్రహింసలు పెట్టిన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అంతే కాకుండా, ‘తూరుపు వీరప్పన్’ శీర్షికన మహదేవ్పూర్ అడవుల్లో కలప స్మగ్లింగ్ను బయటపెట్టింది. “వడ్డీ ‘ఖాకీ’ల వారి దాదాగిరి” ఈ శీర్షికన 2015 అక్టోబర్ 30న ప్రచురితమైన ఈ కథనం పోలీస్ శాఖలో ఓ కుదుపు కుదిపింది. ఆ తర్వాత ఏఎస్ఐ మోహన్రెడ్డి దందాలపై ప్రచురితమైన వరుస కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. మోహన్రెడ్డి ఆస్తులు, బినామీలు, అతని బాధితుల గోడు, వంటి వివరాలతో వరుసగా వచ్చాయి. అందులో ఆయనకు సహకరించిన అధికారుల పేర్లనూ బయటపెట్టగా, వారిపైనా వేటు పడింది.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత వారధిగా..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ‘నమస్తే తెలంగాణ’ కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నది. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడమే కాదు, పథకాలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నది. సర్కారు ఏ పథకం తెచ్చినా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ప్రచురిస్తున్నది. అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు దరఖాస్తు ఎలా చేసుకోవాలో సూచిస్తున్నది. అలాగే పేదలకు చేరుతున్న పథకాల గురించి సమగ్రంగా ఇస్తున్నది. తెలంగాణ వరదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల గురించి సమగ్ర కథనాలను ఇచ్చి, నీటిని సద్వినియోగం చేసుకునేలా అర్థం చేయించింది. కరోనా నేపథ్యంలో అనవసర భయాలు, అపోహలు తొలగించేలా కథనాలను ఇచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలు, ఏయే వైద్యశాలలో ఎలాంటి వసతులున్నాయి ఇలా పూర్తి సమాచారం ఇచ్చింది. అలాగే వైద్యుల సలహాలతోపాటు మానసిక నిపుణులు, కోలుకున్న పెషేంట్ల సూచనలు ఇస్తూ, మానసిక ధైర్యం పెంపొదేలా చేసింది.
శాఖల్లో పనితీరుపై పాశుపతాస్త్రం..
వివిధ శాఖల పనితీరును ఎండగట్టింది. ముఖ్యంగా రెవెన్యూలో అధికారుల అక్రమాలను బయటపెట్టింది. ‘అవినీతి ఊడలు’, ‘రెవెన్యూ దందా’, ‘రెవెన్యూ మారేనా..?’, ‘దేవుడు దేవుడే లంచం లంచమే’, ‘ఊడలు దిగిన అవినీతి!’, ‘గొర్రెను తిన్నరు గోస పెడుతున్నరు’.. ఇలా ఒకటా రెండా ఎన్నో కథనాలతో ఆ శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టింది. ఇటు నిబంధనలకు నీళ్లొదిన ప్రైవేట్ దవాఖానల తీరును బహిర్గతం చేసింది. ఎన్నో దవాఖానల దోపిడీ తీరును వెలుగులోకి తెచ్చి, ఏకంగా దవాఖానలను సీజ్ చేసేలా చేసింది. ప్రభుత్వ వైద్యులే అయినా సేవలందించకుండా ప్రైవేట్, ల్యాబ్లు హాస్పిటళ్లు నడపడం వంటివి వెలుగులోకి తెచ్చి వేటు పడేలా చేసింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై కథనాలను ఇచ్చి, మెరుగైన వైద్య సేవలందేలా చూసింది. విద్యాశాఖలోని అక్రమాలను బహిర్గతం చేసింది. ఉపాధ్యాయుల సాధకబాదకాలను ఇవ్వడంతోపాటు దారితప్పిన పంతుళ్లు గాడిన పడేలా చేసింది. సంఘాల వివాదాలను, నకిలీ బిల్లులు, నకిలీ సర్టిఫికెట్ల బాగోతాలను, బది‘లీలలు’, ఇతర దందాలను ఎన్నింటినో బయటికి తెచ్చింది.