హైదరాబాద్: రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేత, జులై 1 నుండి విద్యాసంస్థల నిర్వహణ, రాష్ట్రంలో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం వంటి పలు తీర్మానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సమావేశం సందర్భంగా రాష్ట్రంలో గత సంవత్సరం వరిధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పైచిలుకుగా ఉందని వ్యవసాయ శాఖ కేబినెట్కు తెలిపింది. ముగిసిన సీజన్లో పండిన 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని మార్కెటింగ్ శాఖ వివరించింది. రూ. 5,145 కోట్లు రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో జమయ్యాయని వ్యవసాయశాఖ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కష్టకాలంలో కూడ ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి, సంబంధిత శాఖల అధికారులను, సిబ్బందిని కేబినెట్ అభినందించింది.
గొర్ల పెంపకం వృత్తిలో ఉన్న యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. క్షవర వృత్తిలో ఉన్న నాయీ బ్రాహ్మణుల కోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చేనేత, గీత కార్మికులకు త్వరిత గతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలంది. మత్స్య, గీత కార్మికులకు అందించాల్సిన ఎక్స్ గ్రేషియాను వెంటనే విడుదల చేయాలంది. వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కార్పోరేషన్కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది.