ప్రతి వారం బాక్సాఫీస్ దగ్గర త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఈ వారం కూడా అలాగే ఉండేది. కాకపోతే ఉన్నట్టుండి రేసు నుంచి గోపీచంద్ సీటీ మార్ సినిమా తప్పుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా ఈ సినిమా ఏప్రిల్ 2 నుంచి మరో తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈవారం మరో రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్.. కార్తి హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమాలు ఏప్రిల్ 2న విడుదల అవుతున్నాయి. వీటికి ఒక రోజు ముందు కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమా కూడా తెలుగులో విడుదలవుతుంది. అయితే దీనిపై పెద్దగా అంచనాలు లేవు. కనీసం ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.
కన్నడ సినిమాలకు తెలుగులో ఆదరణ తక్కువగా ఉంటుంది. కేజిఎఫ్ సినిమా విజయం సాధించింది కాబట్టి కన్నడ హీరోలు వరుసగా తెలుగు ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దర్శన్ హీరోగా వచ్చిన రాబర్ట్, ధ్రువ సర్జ పొగరు సినిమాలు అలాగే వచ్చి వెళ్లిపోయాయి. ఇప్పుడు పునీత్ యువరత్న సినిమాతో వస్తున్నాడు. అయితే ఈ వారం అందరి దృష్టి మాత్రం నాగార్జున, కార్తీ సినిమాలపైనే ఉంది.
చాలా రోజులుగా ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్న వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న విడుదలవుతుంది. ఇందులో NIA ఏజెంట్ గా నటించాడు నాగార్జున. అహిషోర్ సోలోమన్ ఈ చిత్రానికి దర్శకుడు. ట్రైలర్, టీజర్ బాగుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరోవైపు సుల్తాన్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. భాగ్యరాజా కన్నన్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. 100 మంది రౌడీలు ఉన్న దగ్గరికి హీరో వెళ్లి వాళ్లను ఎలా మార్చాడు అనేదే ఈ సినిమా కథ. పూర్తిగా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సుల్తాన్ తెరకెక్కింది.
సాధారణంగా కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు సుల్తాన్ కూడా అదే అంచనాలతో వస్తుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర నాగార్జున, కార్తీ మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అన్నట్టు నాలుగేళ్లు కింద ఇద్దరు కలిసి ఊపిరి సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకరి సినిమాతో ఒకరు పోటీ పడుతున్నారు.