లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్తో సోమవారం భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ములాయంను కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి వాకబు చేశానంటూ లాలూ ప్రసాద్ యాదవ్ తమ భేటీకి సంబంధించిన పలు ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. రైతులు, పేదలు, నిరుద్యోగులు, అసమానత్వం వంటి పలు అంశాలపై తాము పరస్పరం తమ ఆలోచనలు పంచుకున్నామని చెప్పారు.
దేశానికి ఇప్పుడు మతతత్వం, క్యాపిటలిజం అవసరం లేదని సంక్షేమం, సమానత్వం అవసరమని భేటీ అనంతరం లాలూ వ్యాఖ్యానించారు. లాలూ, ములాయం భేటీలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. కాగా చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకెళతామని అఖిలేష్ పేర్కొన్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసే ప్రతిపాదనతో గతనెలలో అఖిలేష్ యాదవ్ ఆప్ నేత సంజయ్ సింగ్తోనూ చర్చలు జరిపారు. కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బీఎస్పీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.