న్యూఢిల్లీ, మే 27: భారతదేశ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో రాజకీయ దుమారం రేగుతున్నది. దీనికి కారణం… లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే! లక్షద్వీప్లో ముస్లిం జనాభా ఎక్కువ. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవిధంగా పటేల్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మాంసాహారాన్ని ఎక్కువగా వినియోగించే లక్షద్వీప్లో బీఫ్ ఉత్పత్తులపై నిషేధం, తీర ప్రాంతంలో మత్స్యకారుల షెడ్ల కూల్చివేత వంటి ప్రఫుల్ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో, హాస్టళ్ల మెనూలో మాంసాహారం లేకుండా చేశారు.
ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకుల నుంచే పటేల్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనను అడ్మినిస్ట్రేటర్గా తొలగించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వినతిపత్రం పంపేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ర్టాల నేతలు కూడా పటేల్ తీరును ఖండించారు. ఆయనను తప్పించాలని ప్రధాని నరేంద్రమోదీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎండీఎంకే చీఫ్ వైకో కోరారు. ఈ విషయంలో ప్రధానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు.
లక్షద్వీప్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేయనున్నది. పటేల్ విధానాలు లక్షద్వీప్లో ‘గుజరాత్ మోడల్’ను అమలు చేయడానికేనని సీపీఎం విమర్శించింది. అయితే సంస్కరణల అమలు ప్రయత్నాలను లక్షద్వీప్ యంత్రాంగం సమర్థించుకున్నది. లక్షద్వీప్ను మాల్దీవులలా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంది.
ఎవరీ పటేల్?
ప్రఫుల్ పటేల్.. గుజరాత్కు చెందిన బీజేపీ నేత. గతేడాది డిసెంబర్లో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్గా నియమితులయ్యారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా పటేల్ హోంమంత్రిగాఉన్నారు.