న్యూఢిల్లీ: ఇండియా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోంది. శనివారం (మే 1) నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరూ వ్యాక్సిన్కు అర్హులే అని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 50 నుంచి 60 కోట్ల మంది ఇండియన్స్ వ్యాక్సినేషన్కు అర్హత సాధించనట్లే. వీళ్లందరికీ వ్యాక్సిన్లు వేయగలిగితే.. ఇక కరోనా అడ్రెస్ కూడా ఉండదు. కానీ అసలు ఉన్న వ్యాక్సిన్లు ఎన్ని? 18 ఏళ్లు నిండిని వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే కోటి మందికి పైగా రిజిస్టర్ కూడా చేసుకున్నారు. కానీ వీరికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ చేసుకునే అవకాశం మాత్రం కల్పించలేదు.
అసలు కేంద్రం చెప్పినట్లు మే 1 నుంచి వీళ్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశాలే కనిపించడం లేదు. తెలంగాణతోపాటు ఢిల్లీ, మహారాష్ట్రలాంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆ విషయాన్ని ప్రకటించేశాయి. వ్యాక్సిన్ల కొరత కారణంగా మే 1న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు లేవని చెప్పేశాయి. ఉన్న వ్యాక్సిన్లను రెండో డోసు వాళ్ల కోసం పక్కన పెట్టారు. కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన దాని ప్రకారమే.. ప్రస్తుతం రాష్ట్రాల దగ్గర అందుబాటులో ఉన్న డోసులు కేవలం కోటి మాత్రమే.
ఇవి ఏ మూలకూ సరిపోవు. ఇప్పటి వరకూ 15 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. అంటే దేశంలో కేవలం 11.5 శాతం మందికి మాత్రమే. అందులోనూ రెండు డోసులూ వేసుకున్న వాళ్లు కేవలం 2.5 కోట్లు మాత్రమే. రానున్న రోజుల్లో మరో 8 కోట్ల వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబతున్నారు.
ప్రస్తుతం సీరం నెలకు 6-7 కోట్లు, భారత్ బయోటెక్ కోటి వ్యాక్సిన్ డోసులు తయారు చేస్తోంది. ఈ లెక్కన చూసుకున్నా.. ఆ 50 నుంచి 60 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు వేయాలంటే ఎన్ని నెలలు పడుతుంది? వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కేంద్రం మరోసారి తమ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన అందరికీ ఒకేసారి కాకుండా మరికొన్నాళ్ల పాటు దేశంలోని కొవిడ్ హాట్స్పాట్లలోని ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్లు ఇవ్వాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.